తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్. ఇప్పటికే మార్చి నెల వరకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేస్తున్నారు. అవి పూర్తిస్థాయిలో భక్తులు బుక్ చేసుకున్న విషయం విదితమే కాగా, ఇప్పుడు ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయబోతున్నారు. ఇవాళ ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లు పెట్టబోతున్నారు. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.
ఇక, తిరుమలలో వైకుంఠద్వారా దర్శనాలు ముగిసిన తర్వాత భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. దీంతో, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, నిన్న శ్రీవారిని 62,223 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,704 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.1 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.