ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి సంగారెడ్డిలోని పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. బీహార్కు చెందిన గఫార్ అలీఖాన్ (56) అనే వ్యక్తి బీడీఎల్లో కూలిపనులు చేస్తుండేవాడు. సంగారెడ్డి జిల్లా బానూరు బీడీఎల్కు చెందిన ఆరేళ్ల బాలికకు గతేడాది అక్టోబర్ 16న కూల్ డ్రింక్లో మద్యం కలిపి తాగించాడు. ఆపై పత్తి చేనులోకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని బాలిక ఎక్కడ బయటపెడుతుందోనని భయపడిన నిందితుడు ఆమెను హత్య చేసి పారిపోయాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గఫార్ అలీఖాన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తాజాగా ఈ కేసు విచారణలో నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. అలాగే రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జస్టిస్ జయంతి తీర్పు వెలువరించారు. కేవలం 11 నెలల్లోనే ఈ కేసులో శిక్ష పడడం గమనార్హం.