కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ సేవలు వారి ఇంటి వద్దకే అందుబాటులో ఉంటాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లడఖ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయితే లడఖ్ ప్రజలు రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తుండగా, కేంద్రం మరో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయడం గమనార్హం.

అమిత్ షా కొత్త జిల్లాల పేర్లను కూడా ప్రకటించారు. అవి జాంస్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్ థాంగ్. ఈ ఐదు కొత్త జిల్లాలతో లడఖ్‌లోని మొత్తం జిల్లాల సంఖ్య ఏడుకి పెరిగింది. లడఖ్ సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ మెరుగైన పాలన అందిస్తామని అమిత్ షా మరోసారి ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం లడఖ్ అభివృద్ధికి మరో ముందడుగు అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లడఖ్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *