భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో రజత పతాకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన లుసానే డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. తన ఆఖరి ప్రయత్నంలో బల్లెంను 89.49 మీటర్లు విసిరాడు. ఈ సీజన్లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్ల త్రోతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 88.37 మీటర్లు, ఉక్రెయిన్ ఆటగాడు ఆర్తుర్ ఫెల్ఫ్నర్ 83.38 మీటర్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నారు.
తోలి రౌండ్లో 82.10 మీటర్లు ఈటెను విసిరి నీరజ్ చోప్రా నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత వరుసగా 83.21 మీటర్లు, 83.13 మీటర్లు, 82.34 మీటర్లు, 85.58 మీటర్ల ప్రదర్శన కనబరిచాడు. ఇక ఫైనల్ రౌండ్లో గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ జావెలిన్ను 90.61 మీటర్లు విసరగా, నీరజ్ చోప్రా తన శక్తినంతా ఉపయోగించి 89.49 మీటర్లు ఈటెను విసిరాడు. ఇది నీరజ్ కెరీర్లో రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అంతకుముందు స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ 2022లో 89.94 మీటర్లు ఈటెను విసిరాడు. ఇప్పటి వరకు అతడి కెరీర్లో ఈ స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ ప్రదర్శనే అత్యుత్తమం గా నిలిచింది.