తెలంగాణలో కొలువుదీరిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి ప్రతినెలా గిరిప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత నెలలో చేపట్టిన గిరిప్రదక్షిణలో అనూహ్యంగా 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం జరిగిన ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండ చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర కొనసాగే ఈ గిరి ప్రదక్షిణ ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ సందర్భంగా వ్రత మండపం, సంస్కృత పాఠశాల, అన్నదాన సత్రం, గిరిప్రదక్షిణ రహదారికి ఇరువైపులా, మల్లాపురంలోని గోశాల తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

రెండు వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో యాదగిరికొండ కిక్కిరిసిపోయింది. ఆషాడ మాసం అయినప్పటికీ వారాంతపు సెలవులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వాహనాల్లో యాదగిరికొండకు చేరుకుని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు రావడంతో ప్రత్యేక, ధర్మదర్శనం క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ టికెట్ దర్శనానికి గంట, ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ శాఖల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 45,68,806 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *