అమెరికాలో పెరుగుతున్న మాంద్యం భయాలు, తూర్పు ఆసియాలో యుద్ధ మేఘాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో ఈరోజు (సోమవారం) భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ప్రారంభ వర్తకంలో నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ భారీ నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే 1.50 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 1,533.11 పాయింట్లు పతనమై 79,448.84 వద్ద, నిఫ్టీ 463.50 పాయింట్లు నష్టపోయి 24,254.20 వద్ద వర్తకమవుతోంది. రికార్డు స్థాయిలో కొన్ని వారాల పాటు లాభాల బాటలో పయనించిన మార్కెట్లు నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ స్టాక్స్ భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్లో టాటా మోటార్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, మారుతీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు పాజిటివ్గా వర్తకమవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లతో పాటు దేశీయ కరెన్సీ రూపాయి విలువ కూడా గణనీయంగా పతనమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే 83.80కి దిగజారి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అమెరికాలో ఉద్యోగ వృద్ధి జూలైలో ఊహించిన దాని కంటే ఎక్కువ మందగించింది. దీంతో ఆర్థిక మందగమన భయాలు పెరిగాయి. ఈ ప్రభావం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై పడవచ్చనే విశ్లేషణలు గ్లోబల్ మార్కెట్లను కుంగదీశాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. మరోవైపు ఇజ్రాయెల్-ఇరాన్, హిజ్బుల్లా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా మార్కెట్లను భయపెడుతున్నాయి.