ప్రస్తుతం ఏ శుభకార్యములకైనా బంగారం లేనిది పని జరగట్లేదు, అంతగా పుత్తడికి ప్రాధన్యత ఇస్తున్నారు. బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మహిళల అందాన్ని రెట్టింపు చేసేది పుత్తడి ఒక్కటే. అలాంటి పుత్తడి ధర అలుపెరగకుండా పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు ఏకంగా రూ. 78 వేల ఆల్టైం హై రికార్డును నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధరపై నిన్న రూ. 400 పెరిగి రూ. 78 వేలకు చేరుకుంది. బుధవారం రూ. 77, 800 ముగిసిన పుత్తడి ధర నిన్న మరో రూ. 400 పెరిగి రూ. 78,250 మార్కును దాటింది. బంగారం ధరతోపాటు పెరిగే వెండిపైనా కిలోకు రూ. 1000 పెరిగి రూ. 94 వేలను తాకింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్ర బ్యాంకులు ముందుకు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు . దీనికితోడు దేశీయంగానూ కొనుగోళ్లు పెరగడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని చెప్తున్నారు. దసరా, దీపావళి వేళ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నాయని, రూ. 80 వేల మార్కును కూడా తాకవచ్చని అంచనావేస్తున్నారు.