దేశంలో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి, మరలా పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు, వరుసగా మూడు రోజులు భారీ స్థాయిలో పెరిగి రికార్డు సృష్టించాయి. గత రెండు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650, రూ.2700 పెరగగా, ఈరోజు రూ.1850 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.710, రూ.2940, రూ.2020 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (ఏప్రిల్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,450గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.95,400గా నమోదయింది. ఈ మూడు రోజుల్లో తులం బంగారంపై ఏకంగా 5 వేలకు పైగా పెరగడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,450గా, 24 క్యారెట్ల ధర రూ.95,400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ మార్కెట్ రేట్లు భారతదేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపాయి.