అభం శుభం తెలియని బాలిక(12)ని ప్రభుత్వ ఉద్యోగి(58) అత్యాచారానికి ఒడిగట్టాడు. నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు లైంగిక దాడి చేశాడు. సైదాబాద్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదటిసారి భయపడి తల్లిదండ్రులకు చెప్పని బాలిక ఈ నెల 11వ తేదీన చాక్లెట్లు కొనడానికి కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి పిలిచి రెండోసారి అతడు ఘాతుకానికి పాల్పడడంతో ఏడ్చుకుంటూ వెళ్లి తన తల్లికి విషయం తెలిపింది.
దీంతో బాలిక తల్లి అదే రోజు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేయకుండా టైంపాస్ చేశారని, చివరకు ఓ పోలీసు అధికారి ఒత్తిడితో 13న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సమాచారం. నిందితుడు కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగి కావడంతో అతడిపై కేసు నమోదు చేయకుండా తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఎస్సై స్వయంగా రంగంలోకి దిగి బాధిత బాలిక తల్లిదండ్రులతో రాజీకి ప్రయత్నించినట్లు తెలిసింది. కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచి నిందితులను అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.