News5am Latest Telugu News Online(12/05/2025) : హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో షాకింగ్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ-జైపూర్ హైవేపై ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో దొంగలు ఏటీఎం మెషిన్ను ధ్వంసం చేయకుండా, ఎటువంటి కార్డ్ ఉపయోగించకుండా సుమారు 10 లక్షల రూపాయలకుపైగా నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఏప్రిల్ 30న జరిగినట్టు పోలీసులు తెలిపారు కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు మొదటగా ఏటీఎం బూత్లోని వీడియో రికార్డింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, అనంతరం సెక్యూరిటీ సిస్టమ్ను హ్యాక్ చేసి నగదు అపహరించారు. చోరీ విషయమై హిటాచీ పేమెంట్ సర్వీసెస్లో పనిచేస్తున్న గౌరవ్ కుమార్ బైస్లా ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ బ్యాంకుల ఎటీఎంల నిర్వహణ బాధ్యతను వహిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ ఎటీఎం రికో ఆటో ఇండస్ట్రీస్ సమీపంలో ఉండగా, దొంగలు నగదుతో పాటు DVR, బ్యాటరీలు, హార్డ్ డిస్క్, పీసీ కోర్, ఛెస్ట్ లాక్ వంటి పరికరాలను కూడా దోచుకెళ్లారు.
ఈ ఘటనపై సదర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ఎటీఎం సాఫ్ట్వేర్ను ఎలా హ్యాక్ చేసారనే కోణంలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కలిసి విచారణ చేస్తున్నారు. వారు ఎంత సమయం తీసుకున్నారన్న దానిపై కూడా దృష్టి పెట్టారు. అదనంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర డిజిటల్ ఆధారాలు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనతో ఎటీఎం భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలు బయటపడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.