ఈ మధ్యకాలంలో మనుషులలో మానవత్వం లేకుండా పోయింది. గజ ఈతగాడి దురాశ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన యూపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్ధన్ సింగ్ ఆదివారం తన మిత్రులతో కలిసి ఉన్నావ్లోని నానామావ్ ఘాట్ వద్ద గంగా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే, ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో ఆయన నీటిలో మునిగిపోయారు. దాంతో ఆదిత్య వర్ధన్ మిత్రులు తమకు ఈత రాకపోవడంతో అక్కడే ఉన్న గజ ఈతగాడు సునీల్ కశ్యప్ సాయం కోరారు. అందుకు అతడు రూ. 10వేలు డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించిన స్నేహితులు తమ వద్ద క్యాష్ లేకపోవడంతో ఆన్లైన్ చేస్తామని చెప్పారు. దాంతో ఆన్లైన్లో రూ.10వేలు తనకు బదిలీ అయ్యే వరకు తాను నీటిలో దూకబోనని చెప్పాడు. ఆదిత్య వర్ధన్ నదిలో కొట్టుకుపోతూ ఉంటే, తనకు రావాల్సిన నగదు బదిలీ అయ్యే వరకు సునీల్ అలాగే వేచి చూశాడు. దీంతో ఆయన నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.