ఆదివారం రాజమండ్రిలోని పర్యాటక ప్రదేశం మారేడుమిల్లిలో ముగ్గురు వైద్యవిద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలను అధికారులు సోమవారం ఉదయం గుర్తించారు. గల్లంతైన మరో విద్యార్థి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. సరదాగా మొదలైన ఆ విద్యార్థుల విహారయాత్ర చివరకు వారి ఇంట్లో త్రీవ విషాదం నెలకొల్పింది. వివరాల్లోకి వెళ్తే, ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు ఆదివారం మారేడుమిల్లికి విహారయాత్రకు వచ్చారు. అందరూ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇందులో పదిమంది అమ్మాయిలు కాగా నలుగురు అబ్బాయిలు ఉన్నారు. మారేడుమిల్లిలోని జలతరంగిణి జలపాతంలో విద్యార్థులు సరదాగా ఈత కొట్టారు. ఈ క్రమంలోనే భారీ వర్షం కురవడంతో జలపాతంలో నీటి ప్రవాహం పెరగడంతో, నీళ్లలో ఉన్న సీహెచ్ హరదీప్, కే సౌమ్య, బీ అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిని అతికష్టం మీద వడ్డుకి చేర్చి ఆసుపత్రికి తరలించారు.
మిగితా విద్యార్థులు కొట్టుకుపోయిన సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి విద్యార్థుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో విద్యార్థి ఆచూకీ ఇంకా దొరకలేదని తెలిపారు. కాగా, హరిణిప్రియ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో రంపచోడవరం ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
.