హైదరాబాద్లోని మణికొండ పరిధి పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి గోల్డెన్ ఓరియో అపార్ట్మెంట్లో మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగడంతో గ్యాస్ సిలిండర్ పేలింది. విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.
ఒక్కసారిగా మంటలు, భారీ శబ్ధం రావడంతో అపార్ట్మెంట్లోని వారంతా బయటకు పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఓ ఫ్లాట్ పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.50 లక్షల విలువైన ఆస్తి దగ్ధమైనట్లు స్థానికులు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు అని తెలిపారు.