ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పోటెత్తడంతో భారీగా నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి బ్యారేజీకి 4.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అధికారులు బ్యారేజీ 70 గేట్లను ఎత్తివేసి నీటిని సముద్రంలోకి వదిలారు. మున్నేరు, పులిచింతల, కట్టలేరు నుంచి బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
దీంతో ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 13 అడుగులపైకి చేరిందని, ఈ నేపథ్యంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బ్యారేజీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.