గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నదిపై ఉన్న డ్యామ్లన్నీ నిండిపోయాయి, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణానది చివర ఉన్న కృష్ణా బ్యారేజీకి దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తిన అధికారులు నీరు రాగానే దిగువకు వదులుతున్నారు. ఈ సమయంలో విజయవాడను అమావాస్య గండం వెంటాడుతుంది. ప్రస్తుతం అమావాస్య కావడంతో సముద్రం పోటు మీద ఉన్నది. అంటే నీరు ఎప్పటిలాగే ఉంటుంది.
దీంతో విజయవాడ బ్యారేజీ నుంచి వెళ్తున్న నీటిని సముద్రంలో కలవడం కాస్త ఆలస్యం అవుతుంది. దీంతో నీరు లంక గ్రామాల వైపు ప్రయాణించే ప్రమాదం పొంచి ఉంది. సముద్రంలో ఆటు సమయంలో సముద్రం ముందుకు వెళ్లి ఉంటే వచ్చిన వరద వచ్చినట్టు సముద్రంలో కలిసేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదను దిగువకు వదలడంతో వరద జలాలు సముద్రంలో కలవకపోవడంతో గంట గంటకు సమీప గ్రామల ప్రజల్లో ముంపు భయాన్ని పెంచుతుంది. దీంతో ఎగువ నుంచి భారీ వరద, దిగువన సముద్ర పోటుతో బెజవాడ వాసులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.