ప్రపంచ వ్యాప్తంగా బాలాపూర్ గణేష్ విగ్రహం లడ్డూ వేలం పాటలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఏడాది గణేష్ నవరాత్రులకు ధూల్ పేట్ లో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ధూల్ పేటకు చెందిన కళాకారుడు లక్ష్మీనా రాయణ సింగ్ ఆధ్వర్యంలో 25 మంది కళాకారుల బృందం 23 ఫీట్ల ఎత్తైన భారీ విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
అంతేకాకుండాఎడమ చెవి పక్కన లక్ష్మీదేవి, కుడిచెవి పక్కన కమలంపై సరస్వతీదేవి కనిపించే విధంగా తయారుచేసిన గణేష్ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటుంది. నూతనంగా రూపు దిద్దుకుంటున్న బాలాపూర్ గణేష్ ఆకృతి తరహాలోనే తమకు కావాలని తమిళనాడు, మైసూర్, బెంగుళూరు, ఏపీ, కడప, తిరుపతి, విజయవాడ, కర్నూల్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో బాలాపూర్ ఆకృతిలోనే మరో 40 గణేష్ విగ్రహాలు తయారవుతున్నాయంటే బాలాపూర్ గణేష్ నమూనాకు ఎంత క్రేజీ ఉందో ఇట్టే అర్థం అవుతుంది. మొట్ట మొదటిసారిగా బాలాపూర్ గ్రామస్తులు 1980లో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1994లో బాలాపూర్ లో ప్రారంభమైన గణేష్ లడ్డు వేలం పాటకు దేశ, ప్రపంచ వ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు లభించింది.