తెలంగాణ రాష్టంలో ఉపాధ్యాయుల భర్తీ కోసం 11,062 పోస్టులు విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవలే తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. టెట్కు, డీఎస్సీ విభిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి వ్యవధి సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంపై తాజాగా స్పందిస్తూ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఎటువంటి వాయిదాలు లేవని అభ్యార్థులు సమయం వృధా చూసుకోకుండా చదువుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది.
ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆన్లైన్ విధానంలో జులై 18 నుంచి ప్రారంభమై ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతాయి అని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల భర్తీ కోసం 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందాయి అని పేర్కొంది. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు అని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిఎస్సీ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు.