కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు డీఎస్సీ అభ్యర్థులకు కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు ఐటీడీఏల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు నుంచి మూడు కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
ఒక్కో సెంటర్లో 150 మంది చొప్పున, మూడు నెలల పాటు శిక్షణ, వసతి, భోజన ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. దీనికోసం ఒక్కో అభ్యర్థికి పాతికవేల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారాలు అంచానా వేశారు. ఇక 16,347 పోస్టులతో ఏపీ సర్కార్ భారీ డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల బీభత్సం కారణంగా ఈ ఉచిత శిక్షణ తాలూకు తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.