గోదావరి నది తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం సమీపంలో వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు చేరడంతో పోలవరం ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం దగ్గర 48.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఈ రోజు ఉదయానికి వరద నీటి మట్టం 54 అడుగులు ధాటి ప్రమాదకరంగా గోదావరి ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలోకి 27 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.
కాగా, పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు అనూహ్యంగా ప్రవహిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు నుంచి 13 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పట్టిసీమ శివక్షేత్రాన్ని వరద నీరు చుట్టుముట్టింది. అలాగే గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలో చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో పాటు భద్రాచలం దిగువన రహదారులపైకి వరద నీరు చేరడంతో విలీన మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.