జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. ఆమెతో పాటు పర్యావరణ, భూగర్భ గనుల శాఖల ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు పంపింది. జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లో కొండరాళ్లను తొలగించేందుకు రేయింబవళ్లు పేలుళ్లు జరుపుతుండడంతో ఈ విషయమై వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దింతో స్పందించిన హైకోర్టు జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. రాత్రిపగలు అనే తేడా లేకుండా దాదాపు పది పేలుళ్లు జరిపి బండరాళ్లను తరలిస్తున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాత్రిపూట పెద్ద శబ్ధాలు వస్తుండడంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో తెలిపారు. ఈ లేఖను న్యాయస్థానం ప్రజాప్రయోజన వాజ్యంగా స్వీకరించి ఇవాళ విచారణ జరిపింది. అనంతరం పర్యావరణ, భూగర్భ గనులు, పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీలతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పేలుళ్లపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా వారికి నోటీసులు ఇచ్చింది.