దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ శాస్త్రీయంగా జరగలేదని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అలాగే బాధితులు వారంలోగా చెరువుల పరిరక్షణ కమిటీ ముందు హాజరై తమ అభ్యంతరాలను తెలియజేయాలని ఆదేశించింది. ఆరు వారాల్లోగా ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో, ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించేవరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని జీహెచ్ఎంసీ తెలిపింది. రికార్డుల ప్రకారం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 65 ఎకరాలు మాత్రమే ఉందని, అధికారులు మాత్రం 160 ఎకరాలు అంటున్నారని, ఇది సరైనది కాదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.