హైదరాబాద్లో అక్రమ కట్టడాలను తొలగిస్తూ ప్రజల మెప్పు పొందిన ‘హైడ్రా’ ఇప్పుడు కూల్చివేతలను నిలిపివేసింది. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను గుర్తించినా, వాటి తొలగింపు పనులను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమై, ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తుండడంతో తమ పనిని ఆపేశామని చెప్పారు. తమ బృందాలు జీహెచ్ఎంసీ మాన్ సూన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని వివరించారు. వర్షాలు తగ్గిన వెంటనే ఆక్రమణల తొలగింపు ప్రారంభిస్తామని వివరించారు.
వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో రంగనాథ్ పర్యటిస్తున్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటల సమీపంలోని కాలనీలను సందర్శించి అక్కడి పరిస్థితికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. చెరువుల పక్కన నిర్మించిన కాలనీలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వారం రోజుల్లోగా ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారు.