ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెల్సిఉండేది కాదు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుణ్యాన ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం పేరు మార్మోగిపోతోంది. ఇటీవలే రాష్ట్ర ఎన్నికలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎంగా రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక భూమిక పోషిస్తున్నా విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన నిర్వహించారు. ఇదిలా ఉంటే పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకొచ్చిందని సమాచారం.
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్చరణ్ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. పవన్ను గెలిపించిన పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ హంగులతో అపోలో ఆసుపత్రిని నిర్మించబోతున్నట్టు సమాచారం. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ కల్యాణ్కు రామ్చరణ్ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే పిఠాపురంలో అపోలో ఆసుపత్రి నిర్మించబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకోసం రామ్చరణ్, ఉపాసన దంపతులు అక్కడ పది ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఆయన ఆ విషయం చెప్పగానే అది కాస్తా సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, పిఠాపురానికి అపోలో ఆసుపత్రి రాబోతోందని తెలియగానే పవన్ అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందనున్నాయి. ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరగనుంది అని పేర్కొన్నారు .