దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో 30-40 కి.మీ. గాలులు వేగంగా వీస్తున్నాయి. ఈరోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా, కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర, కృష్ణా నదులకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు బుధవారం 55 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 50 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 73,573 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.1 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్కు 67,676 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో (312 టీఎంసీలు) 4 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.