నేడు గ్రూప్‌-1 పరీక్షకు కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేశారు అధికారులు. అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 31,382 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2011 సంవత్సరం తర్వాత మళ్లీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీటీవీ లను ఏర్పాటు చేశారు. TGPSC కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బంది నియామకం ఉంటుంది. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఒకటిన్నర తరువాత గేట్స్ క్లోజ్ చేస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా కేటాయింపు ఉంటుంది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సదుపాయం ఉంటుంది. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు, అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *