తెలంగాణలో నేటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తేదీ వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి కుటుంబ వివరాలను సేకరించనున్నారు. గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం (ఆవాసం) పేర్లను కోడ్రూపంలో, వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా నమోదు చేస్తారు. ఈ నెల 9 నుంచి ప్రభుత్వం ముద్రించిన ఫార్మాట్లో కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించి నమోదు చేస్తారు. 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ఆధార్, ధరణి పాస్ బుక్, సెల్ఫోన్ నెంబర్లు కూడా నమోదు చేసుకుంటారని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
అన్ని వివరాలు పూర్తి అయ్యాక, తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్టుగా కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు. ఒక్కో కుటుంబం వివరాల నమోదుకు 10-20 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నది. ఇందుకోసం ఎన్యుమరేటర్లకు నెల రోజులు గడువు విధించారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు 80 వేల మంది ఎన్యూమరేటర్లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఎక్కువ శతం టీచర్లే ఎన్యుమరేటర్లుగా ఉండటంతో వారికి అలవాటయిన పని కావడంతో సులువుగా కులగణన చేపట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది.