తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన వినాయక చవితి ఉత్సవాలు 17న నిమజ్జనం వేడుకలతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలంగాణా ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 17న నగరంలోని అన్ని గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు శోభాయాత్రగా ట్యాంక్ బండ్ వైపు కదులుతాయి. ఈ శోభాయాత్రను చూసేందుకు భారీగా ప్రజలు ట్యాంక్ బండ్ వద్దకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి బదులుగా నవంబర్(9) రెండో శనివారం న పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది.