భాగ్యనగర్లోని పలు ప్రాంతాల్లో సోమవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు ప్రకటించింది. కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్ 1 కింద ప్రశాసన్ నగర్, అయ్యప్ప సొసైటీ మధ్య మంచి నీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ పలు ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడింది. హకీంపేట, గోల్కండ, టోలీచౌక్, లంగర్ హౌజ్, షేక్ పేట, జూబ్లీ, ఫిలింనగర్, మాదాపూర్, తాటి ఖానా, కొండాపూర్, డోయెన్స్ కాలనీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో మంచి నీటి వసతి లేదని స్పష్టం చేశారు.ప్రశాసనగర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు 1200 డయా పీఎస్పీ గ్రావిటీ మెయిన్ పైప్ లైన్ లో పలుచోట్ల లీకేజీలు జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం పైపులైన్ పనులు చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 6.00 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల పాటు మరమ్మతు పనులు కొనసాగుతాయని హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు మంచినీటిని జాగ్రత్తగా పరిశీలించాలని వాటర్ వర్క్స్ అధికారులు సూచించారు. మంగళవారం ఉదయం నుంచి షెడ్యూల్ ప్రకారం నీటి సరఫరా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు.