‘కల్కి 2898 AD’ అనేది నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మరియు ప్రభాస్ నటించిన ఒక పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా రెండవ భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఇటీవల ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి-2’ విడుదల గురించి ఒక సరదా విషయాన్ని పంచుకున్నారు.
‘కల్కి-2’ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ప్రశ్నకు బదులిస్తూ ‘కల్కి’ చిత్రాన్ని 3,4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు విడుదల చేశాను. సీక్వెల్ను 7,8 గ్రహాలు ఒకే వరుసలో వచ్చినప్పుడు రిలీజ్ చేస్తా. మీరంతా కాస్త వేచి చూడండి’ అంటూ స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ‘కల్కి-2’ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని, ఈ సంవత్సరాంతంలో సెట్స్పైకి వెళ్తుందని, భైరవ, కర్ణ పాత్రల కోణంలోనే సీక్వెల్ సాగుతుందని తెలిపారు. ‘కల్కి’ చిత్రీకరణలోనే ‘కల్కి-2’కు సంబంధించిన కొంత భాగాన్ని షూట్ చేశామని గతంలోనే మేకర్స్ ప్రకటించారు.