మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఈ నెల 9న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. యాదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త సంచలనాన్ని అందించింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. అసలు ముఖ పరిచయమే లేని నటులు, కనీసం పేరు కూడా తెలియని డైరెక్టర్ అయినా కానీ బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులతో తాను నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా విజయం సాధించినందుకు నిర్మాత నిహారిక థియేటర్లను సందర్శించి ప్రేక్షకులను నేరుగా అభినందించారు.
ఇటీవల నిహారిక నంద్యాల, కర్నూలు థియేటర్లను సందర్శించింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులతో నేరుగా మాట్లాడారు. ఊహించని విధంగా తమ సినిమాకు రాయలసీమలోనూ వసూళ్లు బాగా రావడం గొప్ప విషయమని అన్నారు. ఇంతటి ఆదరణ చూసి తాను షాకయ్యానని చెబుతూనే.. తన సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నిహారిక ధియేటర్ లకు రాకతో మెగా అభిమానులు, జనసైనికులు సంబరాలు చేస్తూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. మెగా హీరోలు వస్తే ఏ విధంగా అయితే స్వాగతం పలుకుతారో అదే రీతిలో నిహారికను స్వాగతించారు. దీంతో కమిటీ కుర్రోళ్లు సినిమా నిహారికను సంతోషంలో ముంచెత్తుతోంది.