ఎస్సీ, ఎస్టీ కులాల రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెల్లడించింది. రిజర్వేషన్లను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప-వర్గీకరణ సమంజసమేనని ఉద్ఘాటించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదని 2004లో ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయరాదని గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో సీజేఐ డీవై చంద్రచూడ్ అనుమతినిచ్చింది.
ఈ బెంచ్లోని ఒక న్యాయమూర్తి బేలా త్రివేది మాత్రమే ఉపవర్గీకరణ సాధ్యం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీజేఐ చంద్రచూడ్తో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ మనోజ్ మిశ్రా లు ఉప వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీం బెంచ్ రాష్ట్రాలను ఆదేశించింది. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాలు ఉండాలని ఆదేశించారు.