భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఆగస్టులో ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెల రోజుల క్రితం ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. ఇటీవల మోదీ రష్యా పర్యటనపై జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి జరిగిన రోజున మోదీ, పుతిన్‌లు సమావేశమయ్యారంటూ జెలెన్‌స్కీ అప్పట్లో మండిపడ్డారు. ఇది చాలా నిరాశపరిచే పరిణామమని, శాంతిభద్రతల సాధనకు పెద్ద దెబ్బ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ఉక్రెయిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు ఎన్నికల విజయంపై ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ అభినందనలు తెలిపారు మరియు తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించారు.

మార్చిలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మోదీతో ఫోన్ లో చర్చించారు. చర్చలు మరియు దౌత్యం ద్వారా రష్యాతో యుద్ధాన్ని ముగించాలని అతను ఆశించాడు. ఈ సమస్యకు సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని కనుగొనడానికి తాను చేయగలిగినదంతా చేస్తానని మోదీ అప్పుడు హామీ ఇచ్చారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ ఈ అంశంపై చర్చల ద్వారానే మాట్లాడుతోంది. శాంతి స్థాపనకు తమవంతు కృషి చేస్తామని మోదీ చెప్పారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన భేటీలో ప్రధాని ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో ఏ సమస్య పరిష్కారం కాదు. ఐక్యరాజ్యసమితి చార్టర్, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలన్నదే భారత్ అభిమతమని ఆయన అన్నారు. చర్చలు, దౌత్యమే ముందున్న ఏకైక మార్గమని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *