జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని బైసరన్ మైదాన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణ సంఘటన జరిగింది. ఈ దాడిలో 25 మందికి పైగా మరణించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మృతుల్లో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారని సమాచారం.
కాగా, ఈ క్రూరమైన దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ప్రకటించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ సంస్థ ఆగస్టు 2019లో వెలుగులోకి వచ్చింది. లష్కరే తోయిబా తో అనుబంధంగా ఉన్న ఈ సంస్థ, కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు స్థానిక మద్దతు అందించడానికి ఏర్పడిందని భావిస్తున్నారు.