లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ కేరళలోని వయనాడ్లో పర్యటించారు. వారి వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఉన్నారు. కన్నూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో సుల్తాన్ బతేరీకి వెళ్లారు. కేరళలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వందలాది మంది చనిపోయారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. వయనాడ్ ఘటనపై సీఎం విజయన్తో చర్చించనున్నారు. పరిస్థితి ఇంకా అస్తవ్యస్తంగా ఉందని, అయితే సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.
వాస్తవానికి బుధవారం (జులై 31)న సందర్శించాలనుకున్న రాహుల్, ప్రియాంక వాతావరణం అనుకూలించకపోవడంతో ఈరోజు (ఆగస్టు 1)న వెళ్లారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటులో లేవనెత్తానని ప్రతిపక్ష నేత రాహుల్ అన్నారు. వయనాడ్ ఘటనపై అంచనా వేసేందుకు రక్షణశాఖామంత్రి, సీఎం విజయన్తో మాట్లాడినట్లు తెలిపారు. కేరళలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలలో, వయనాడ్లో కుండపోత వర్షాల కారణంగా సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడటంతో కనీసం 282 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాలలో 240 మంది చిక్కుకున్నారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.