ఎన్నికల తర్వాత ఏపీలో 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ ఆరోపిస్తుంటే.. చనిపోయిన వారి పేర్లను ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా జగన్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. “రషీద్ అనే వ్యక్తి చనిపోతే అతని ఇంటికి వెళ్లాం అని చెప్పుకుంటున్నారు, రషీద్ ఎవరు? ఎవరు చంపారు ? ఎవరు చనిపోయారు? వాళ్లు ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నా. మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారా, లేదా? సరే అది అయిపోయింది, 36 మంది చనిపోయారని గవర్నర్ వద్దకు వెళ్లావు, ఆ 36 మంది పేర్లు చెప్పండి.
రషీద్ను హత్య చేసిన వారిని అరెస్ట్ చేశాం. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే ఆ పేర్లు ఇవ్వు, గతంలో మీరు చంపిన వారి పేర్లు నేనిచ్చాను. ఇప్పుడు వారిపై కూడా చర్యలు తీసుకుంటాం, మళ్లీ ఆ కేసులన్నీ ఓపెన్ చేస్తాం. ఈరోజు నువ్వు చెప్పేదానిపై కూడా చర్యలు తీసుకుంటా సిద్ధమా? అని సవాల్ విసురుతున్నా. మాయ మాటలు మాట్లాడకు, దొంగ ఏడుపులు వద్దు, నంగి మాటలు వద్దు. తప్పు చేస్తే మా పార్టీ వాళ్లను కూడా శిక్షిస్తానని చెప్పాను. రాజకీయ ముసుగులో తప్పుడు ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యం కాదు. ఆ ముసుగు తీసేస్తాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.