విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ మళ్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యలకు టెక్నాలజీ వాడుకోవాలని, వాట్సాప్ గ్రూపులతో అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్లను ఉపయోగించాలని సూచించారు.