ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీలలో రెండు రోజులపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాలలో ప్రచారం చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ క్రమంలో పవన్ 5 బహిరంగ సభలు, రెండు రోడ్ షోలలో పాల్గొంటారని పార్టీ తెలిపింది.

మొదటి రోజున మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం నిర్వహిస్తారు. 16వ తేదీన ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ చేరుకుని సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు షోలాపూర్ నగరం చేరుకొని అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. మరుసటి రోజు విదర్భ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ వెళ్లనున్నారు. ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని జనసేన నేత పి.హరిప్రసాద్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *