ఏపీ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4న కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. కానీ మంగళవారం జరపాలని నిర్ణయించారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ మీటింగ్ ప్రీ పోన్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి జీఏడీకి పంపించాలని ఆదేశించారు. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ అమలులో లోటు పాట్లు, సూపర్ సిక్స్ పథకాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, అమరావతి మాస్టర్ ప్లాన్ తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు.