ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నాలుగో రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు, రాబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు అందించారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమష్టిగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
గత మూడు రోజులుగా కేసీఆర్ ఉమ్మడి వరంగల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం, కార్యకర్తలకు ప్రోత్సాహం, ప్రజలతో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. అన్ని జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తున్నారు. వరంగల్ సభను విజయవంతం చేసి, పార్టీ శక్తిని మరోసారి నిరూపించుకోవాలని కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి అన్నారు.