ప్రజా పాలన, విజయోత్సవాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ముగిసింది. డిసెంబరు 9వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపరిపాలన విజయోత్సవాలపై సీఎం అధికారులు చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రేవంత్ సూచించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువత సాధికారత వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అలాగే, ఈ నెల 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్, సెక్రెటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 9న సెక్రెటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను సీఎం చేయనున్నారు. ఇక, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, శాఖల వారీగా, విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు.