ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్‌తో పాటు రాయబరేలి నుండి కూడా పోటీ చేసి గెలిచారు. దీంతో వాయనాడ్ లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. దీంతో వాయనాడ్ లోక్ సభకు ఉప ఎన్నిక అనివార్యం కాగా, ప్రియాంక గాంధీ వాయనాడ్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రియాంక గాంధీ ఈ రోజు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేసేందుకు రాహుల్ గాంధీతో కలిసి ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయం నుండి వాయనాడ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నా హృదయంలో వాయనాడ్ ప్రజలకు ప్రత్యేక స్థానం ఉంది. వారికి నా సోదరి ప్రియాంక కంటే మెరుగైన ప్రజా ప్రతినిధిని ఉహించలేను’ అని చెప్పుకొచ్చారు. ఆమె వాయనాడ్ ప్రజల తరపున పార్లమెంట్ లో తన గళమెత్తుతారని నాకు నమ్మకం ఉందని రాహుల్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *