తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన జీవితంలో మర్చిపోలేని రోజు ఇది అని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా నేడు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో భేటీ నేపథ్యంలో బుధవారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కెసిఆర్ రూ.28 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేయలేదన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. ఆర్థిక నిపుణులు సైతం రుణమాఫీ కష్టసాధ్యమని… ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. అయినప్పటికీ రుణమాఫీ చేస్తున్నామన్నారు.

పార్టీకి నష్టమని తెలిసినా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది

ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని అన్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఆ రోజు సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమే అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ మాట ఇస్తే చేస్తారన్నా నమ్మకం కలిగించడం మన బాధ్యత అని అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు.

కేసీఆర్ లాగా మాటలు చెప్పి మభ్యపెట్టడం లేదు

కెసిఆర్ లాగా మాటలు చెప్పి రుణమాఫీ పేరుతో రైతులను తాము మభ్యపెట్టడం లేదన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. అందుకే ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని కేడర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయుల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ‘రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండి. రుణమాఫీపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి’ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదన్నారు.

హామీని అమలు చేశామని పార్లమెంట్‌లో చెప్పండి

రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేశామని ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సూచించారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *