రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి.. ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం.. ‘రైతు రుణమాఫీ పథకం’ అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. నాడు శ్రీ మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా.. నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా.. ఎంత కష్టమైనా.. ఎంత భారమైనా.. ఏకకాలంలో రుణమాఫీ.. చేసిన.. చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. రుణమాఫీ అమలులో తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా, మలి అడుగు విధివిధానాల ఖరారు అని సీఎం తెలిపారు. ప్రజాప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని పేర్కొన్నారు. ‘ఇది రైతన్నకు.. మీ రేవంతన్న మాట’ అంటూ ముఖ్యమంత్రి మంగళవారం ట్వీట్ చేశారు.