ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చి 15 వతేదీన హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఉన్న కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఈడీ, సీబీఐ దాఖలు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంతో కల్వకుంట్ల కవిత కూడా తనకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ మేరకు నేడు సుప్రీంకోర్టులో జరిగే కవిత పిటీషన్ పై జస్టిస్ విశ్వనాధ్, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారించనుంది.
కవిత సీబీఐ ట్రయల్ కోర్టు, ఢిల్లీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా ఆ రెండు కోర్టులు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆమె ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా, ఇటీవలే ఇదే కేసులో అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. అదే ఆశతో తనకు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్మిన కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేక రిమాండ్ను పొడిగిస్తుందా అనే విషయంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏదో తెలియని టెన్షన్ నెలకొంది. ఎలాంటి తీర్పు వస్తుందో అని బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.