ప్యారిస్ ఒలింపిక్స్లో 50 కిలోల విభాగంలో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఫొగాట్ సీఏఎస్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతపై సాయంత్రం 5.30 గంటలకు కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ (సీఏఎస్) విచారణ జరపనుంది. ఈ పిటిషన్పై శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విచారణ జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల విచారణ సాయంత్రం ఐదున్నరకు వాయిదా పడింది. రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కిలోల విభాగంలో అదనపు బరువు కారణంగా వినేశ్ ఫొగాట్ ఫైనల్లో అనర్హతకు గురయ్యారు. అయితే ఫైనల్ వరకు వచ్చిన తనకు రజతం ఇవ్వాలని ఫొగాట్ కోరారు. అయితే ఒలింపిక్స్లో నిబంధనలను మార్చే అవకాశం లేదని యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ తేల్చి చెప్పింది.
అయితే ఆర్బిట్రేషన్ అనుమతిస్తే ఫొగాట్కు రజతం దక్కే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయంపై సాయంత్రం 5.30 గంటలకు సీఏఎస్ విచారించనుంది. ఫొగాట్ తరఫున వాదనలు వినిపించేందుకు భారత ఒలింపిక్ సంఘం ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియాను నియమించింది. వీరితో పాటు ఫ్రెంచ్ న్యాయవాదుల బృందం కూడా వాదనలు వినిపించనుంది. సీఏఎస్ తీర్పు కోసం యావత్ భారత్తో పాటు ప్రపంచ క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.