పారిస్ ఒలింపిక్స్ 2024లో సంచలనం సృష్టించిన షూటర్ మను బాకర్ తన స్వదేశానికి చేరుకున్నారు. ఇటీవలే ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను బాకర్ కి దేశరాజధాని ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తులో అభిమానులు తరలివచ్చి ఢిల్లీ విమానాశ్రయం వద్ద డప్పుల వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. భారత అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం తన కారులో ర్యాలీగా బయలు దేరారు. తన మెడల్ను అభిమానులకు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. బాకర్ వెంట కోచ్ జస్పాల్ రాణా ఉన్నారు.
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో మను బాకర్ ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు సార్లూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మను బాకర్ మళ్లీ పారిస్ వెళ్లనుంది. భారత పతాకధారుల్లో మను ఒకరుగా నిలిచారు. ఆదివారం జరిగే ముగింపు వేడుకలకు హాజరు కానుంది. ఈరోజు మధ్యాహ్నం క్రీడల మంత్రిని కలవనుంది. భారత ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉంది.