ప్రజా భవన్ లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని , మంత్రి కొండా సురేఖ తలపై బోనాలను ఎత్తుకుని ప్రజాభవన్ లోని నల్లపోచమ్మకు సమర్పించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయంగా తీసుకు వచ్చి శివసత్తులకు అందించారు.
అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు సీఎం సహా మంత్రులకు ఆశీర్వచనం అందించారు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం పసుపు, కుంకుమలు అద్దుకుంటుంది. వేప కొమ్మలతో ఊరువాడ డప్పు చప్పుళ్లతో మురిసిపోతుంది. దశాబ్దాలుగా సాగుతున్న బోనాల వేడుకలు ఈనెల 7న గోల్కొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కోటపై స్వయంభుగా వెలిసిన శ్రీ జగదాంబిక అమ్మకు భక్తులు వైభవంగా బోనాలను సమర్పించారు.