Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాస మహోత్సవాలు నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం భక్తుల రద్దీతో కిటకిటలాడే ఈ క్షేత్రంలో, ఈసారి కూడా నెలరోజుల పాటు భక్తి ఉత్సవాలకు శుభారంభం అయింది. శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు ఉండటంతో ప్రతి సోమవారం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం లింగార్చన కార్యక్రమం జరుగుతుంది. ఐదు శుక్రవారాల్లో మహాలక్ష్మీ అమ్మవారికి మరియు శ్రీ రాజరాజేశ్వరి దేవికి షోడశోపచార పూజలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈరోజు తొలి శుక్రవారం కావడంతో శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున ఆలయాన్ని దర్శించి కోడె మొక్కులు చెల్లించడమే కాక, స్వామివారికి అభిషేకాలు, అన్నపూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. రాబోయే నెల 9న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఋగ్వేద, యజుర్వేద ఉపాకర్మ కార్యక్రమాలు వేదపాఠశాలల వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో నెల రోజులపాటు జరిగే ఈ శ్రావణమాస మహోత్సవాలు భక్తులను ఆధ్యాత్మికంగా అలరించనున్నాయి.
Internal Links:
తిరుమలలో ఇకపై ఈ భక్తులకు గదుల కేటాయింపు రద్దు..
మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా మద్యం..
External Links:
వైభవంగా ప్రారంభమైన శ్రావణమాస మహోత్సవాలు..