నిత్యం పరుగులు పెడుతున్న బంగారం ధరలకు నేడు కాస్త బ్రేక్ పడింది. దీంతో బంగారం కొనుగోలు దారులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం ( ఫిబ్రవరి 12) ఊరట కలిగించాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారం ధర రూ.710 లు తగ్గి 86వేల 670 ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 లు తగ్గి 79వేల 400 లకు చేరింది.
ఫిబ్రవరి ప్రారంభం నుంచి బంగారం ధరలు రోజూ పెరుగుతూ వస్తున్నాయి. ప్రారంభంలో 84 వేల 490 లున్న బంగారం ధర, 12రోజుల్లో రూ. 2వేలకు పైగా పెరిగింది. ఇదే కొనసాగితే మే నాటికి బంగారం ధరలు లక్షకు చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో మార్పులను బట్టి బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోను కావచ్చు. బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. డాలర్తో పోలిస్తే రూపాయి రేట్లు,కేంద్రం విధించే దిగుమతి సుంకాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ లో రూ.1,07,000ల వద్ద ట్రేడ్ అవుతుంది.