మేడ్చల్ పట్టణంలో ఓ త్రీవ విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ పట్టణం రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్న కృష్ణ రైల్వే లైన్మెన్గా పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలను తనతో పాటు వెంట తీసుకుని వెళ్లాడు. అక్కడ తాను ట్రాక్ పనులు చేస్తుండగా పిల్లలిద్దరూ రైల్వే లైను పై ఆడుకుంటున్నారు. ఇంతలోనే అనుకోకుండా ట్రాక్పైకి ట్రైన్ రావడంతో, ఆ ట్రాక్ మీద ఉన్న తన పిల్లలు ఉన్నారని గుర్తొచ్చి కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే వేగంగా వచ్చిన రైలు ఆ ముగ్గురిని ఢీకొట్టడంతో ఇద్దరు కూతుళ్లతో పాటు ఆ తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే ట్రాక్పై ముగ్గురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు
ఈ విషయాన్ని కృష్ణ భార్యకు తెలియజేయగా ఆ ముగ్గురి మృతదేహాలను చూసి ఆ తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరు శోకం పెట్టుకుంది. ఆమె నిస్సహయా స్థితిని చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టుకున్నారు. రెప్పపాటులో జరిగిన ఈ ఘటన ఒక కుటుంబాన్ని బలితీసుకుంది. అన్యం పుణ్యం తెలియని తన బిడ్డలని దేవుడు తీసుకెళ్లాడు అంటూ ఆ తల్లి గుండెలు పగిలేలా రోధిస్తోంది. మృతి చెందిన కూతుర్ల పేరు వర్షిత, వరిణి అని పోలీసులు గుర్తించారు.